జమ్మూకశ్మీర్‌లో కొనసాగుతోన్న రెండో విడత ఎన్నికల పోలింగ్

  • ఆరు నియోజకవర్గాల్లో 26 అసెంబ్లీ స్థానాల్లో ఓటింగ్
  • రెండో విడత ఎన్నికల్లో 239 మంది అభ్యర్ధుల భవితవ్యం
  • పోటీలో మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా సహా పలువురు కీలక నేతలు
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు సాగనుంది. పీర్ పంజాల్ పర్వత శ్రేణికి ఇరు వైపులా ఉన్న శ్రీనగర్, బడ్ గామ్, రాజౌరీ, ఫూంఛ్, గండేర్‌బల్, రియాసీ జిల్లాల్లోని 26 స్థానాలకు ఈరోజు పోలింగ్ జరుగుతోంది. ఈ విడతలో 25.78 లక్షల మంది ఓటర్లు 239 మంది అభ్యర్ధుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. 

మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా, బీజేపీ జమ్మూ కశ్మీర్ చీఫ్ రవీందర్ రైనా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తారిఖ్ హమీద్ కర్రా సహా పలువురు కీలక నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఒమర్ అబ్దుల్లా గండేర్‌బల్, బడ్‌గామ్ స్థానాల్లో పోటీలో చేస్తుండగా, హమీద్ కర్రా సెంట్రల్ షాల్టెంగ్ నియోజకవర్గంలో, నౌషేరా స్థానంలో రవీందర్ రైనా బరిలో నిలిచారు. 3,502 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. 
 
ఈ నెల 18న జరిగిన తొలి విడత పోలింగ్‌లో 61.38 శాతం ఓటింగ్ నమోదైంది. అక్టోబర్ 1న మిగతా 40 స్థానాలకు చివరి దశ పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 8న ఫలితాలు విడుదల కానున్నాయి.

Jammu And Kashmir
Assembly Elections
polling

More Telugu News